బొగ్గు మసి కాగ్ పుణ్యమే... ప్రధాని
న్యూఢిల్లీ,ఆగస్ట్ 27: బొగ్గు కేటాయింపులకు పూర్తి బాధ్యత తనదేనని, అయితే ఇందులో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకోలేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోకసభలో స్పష్టం చేశారు. కోల్ గేట్ వ్యవహారం సోమవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ పెట్టుబడులను ప్రోత్సహించేందుకే రాయితీలు ఇచ్చినట్లు చెప్పారు. కాగ్ నివేదిక అవాస్తవమన్నారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల పై 1993 నుండి విధానాలు మారలేదన్నారు. గత ప్రభుత్వాల విధానాలనే తామూ కొనసాగించామని చెప్పారు. ఆయన ప్రకటన చేస్తుండగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ కుంభకోణానికి బాధ్యుడు ప్రధానియేనని, అందుకు బాధ్యతగా ఆయన వెంటనే పదవి నుండి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. విపక్షాల నిరసనల మధ్య ప్రధాని ప్రకటన కొనసాగింది.

Comments