హర్యానా మంత్రి మెడకు చుట్టుకున్న మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు
న్యూఢిల్లీ, ఆగస్ట్ 9: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక ఆత్మహత్య హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా మెడకు చుట్టుకుంది. ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది. దీనితో తన తన పదవికి రాజీనామా చేసిన గోపాల్ కందా అజ్ఞాతం లోకి వెళ్ళిపోయారు. గతంలో ఆయన నిర్వహించిన ఎండిఎల్ఆర్ విమానయాన సంస్థలో గీతికా శర్మ ఎయిర్ హోస్టెస్గా పని చేసింది. కేసులో నిందితుడైన గోపాల్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, అతని ఆచూకీ దొరకగానే అరెస్టు చేస్తామని డిల్లీ పోలీసులు చెప్పారు. గూర్గాన్లోని కందా ఫామ్ హౌస్లో, సిర్సాలోని అతని ఇంట్లో, అతని కార్యాలయాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు.అరెస్టు ప్రచారం నేపథ్యంలో గోపాల్ కందా తన న్యాయవాదిచే గురువారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కాగా, గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఎండిఎల్ఆర్ మేనేజర్ అరుణా చద్దాను అరెస్టు చేశారు.

Comments