కెప్టెన్ లక్ష్మీసెహగల్ కన్నుమూత
కాన్పూర్,జులై 23: భారత స్వాతంత్య్ర పోరాట యోధురాలు కెప్టెన్ లక్ష్మీసెహగల్ కన్నుమూశారు. ఆమె వయసు 98 సంవత్సరాలు. కెప్టెన్ లక్ష్మీసెహగల్ స్వాతంత్య్ర పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులపై సాయుధ పోరాటం నడిపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగమైన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్కు ఆమె నాయకత్వం వహించారు. 1947లో కల్నల్ ప్రేమ్కుమార్ సెహగల్ను వివాహమాడారు. అప్పటి నుంచి కాన్పూర్లో నివసిస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన సెహగల్ కాన్పూర్ లో క్లినిక్ ఏర్పాటు చేసి లక్షలాది మంది పేద మహిళలకు ఉచితంగా వైద్య చికిత్స అందించటం ప్రారంభించారు. వైద్య వృత్తిని కొనసాగించటంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా పనిచేసేవారు. ఆమెకు 1998లో భారత ప్రభుత్వం పద్మవిభూషన్ అవార్డును బహూకరించింది. ఆమె 1971 లో సీపీఎం పార్టీలో చేరారు. పార్టీ టికెట్పై రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా ఎ.పి.జె.అబ్దుల్కలాంపై పోటీ చేసి ఓడిపోయారు.

Comments