టెన్నిస్ వివాదం....విష్ణువర్హన్ వద్దన్న పేస్...
న్యూఢిల్లీ,జూన్ 21: హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణువర్దన్ ఆశలపై భారత నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ నీళ్లు చల్లారు. లండన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు టీవీ చానెల్ వార్తలు తెలియజేస్తున్నాయి. చాలా తక్కువ ర్యాంక్ ఉన్న విష్ణువర్ధన్తో జోడీ కట్టాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) నిర్ణయించడాన్ని నిరసిస్తూ లియాండర్ పేస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. లండన్కు రెండు జట్లను పంపుతున్నట్లు ఎఐటిఎ ప్రకటించింది. మహేష్ భూపతి, రోహన్ బోపన్న ఒక జోడీగా, లియాండర్ పేస్, విష్ణువర్ధన్ మరో జోడీగా లండన్ వెళ్తారని సంఘం ప్రకటించింది. అయితే జూనియర్ ఆటగాడిని తనకు జతగాడిగా నిర్ణయిస్తే ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటానని పేస్ హెచ్చరించారు. లియాండర్ తండ్రి, ఒపింపియన్ వేసే పేస్ కూడా ఎఐటిఎ నిర్ణయంపై ధ్వజమెత్తారు. ప్రపంచ నెంబర్ 328 క్రీడాకారుడు విష్ణు వర్ధన్ను తన కుమారుడికి జోడీగా నిర్ణయించడం సరి కాదని ఆయన అన్నారు. దేశ అత్యున్నత స్థాయి ర్యాంక్ ఆటగాడి పట్ల అది అన్యాయమేనని ఆయన అన్నారు. విష్ణువర్ధన్ పేస్తో ఆడడానికి చాలా ఉత్సాహం ప్రదర్శించాడు. ఈ అవకాశం వచ్చినందుకు అతను ఆనందించాడు. అయితే, పేస్ నిర్ణయం మరో విధంగా ఉండడం విష్ణువర్ధన్కు నిరాశ మిగిల్చింది.
Comments