రాజస్థాన్ బి.జె.పి.లో భగ్గుమన్న అంతర్గత విబేధాలు
జైపూర్ ,మే 6: రాజస్థాన్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మరో కీలక నేత కటారియా మధ్య నాయకత్వ పోరు పతాకస్థాయికి చేరుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో నిలిచే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కటారియా తలపెట్టిన "లోక్జాగరణ్ యాత్ర'' తాజా వివాదానికి కారణమైంది. ఈ యాత్రను వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో తాను పార్టీకి రాజీనామా చేస్తానని వసుంధరా రాజే సింధియా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరితో పాటు పలువురు కీలక నేతలు వసుంధర రాజేకు మద్దతు పలికారు. వసుంధర రాజే బాటలో తాము కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. కటారియా యాత్ర అంశాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. దీనితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు గట్కరీ రంగంలోకి దిగి కటారియాను ఫోన్లో సంప్రదించారు. ప్రస్తుతానికి యాత్రను విరమించుకోవాలని సూచించారు. దీనితో కటారియా తన యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments