అన్నవరం లో కన్నులపండువగా కళ్యాణం
అన్నవరం, మే 2: రత్నగిరిపై కొలువైన శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్యకల్యాణ మహోత్సవం వైశాఖశుద్ధ ఏకాదశి బుధవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు తిలకిస్తుండగా శాస్త్రోక్తంగా అర్చకస్వాములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి నూతనాలయంలో స్వామి, అమ్మవార్లు కొలువైన తర్వాత జరిగిన ఈ ఉత్సవానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గురుమూఢం కారణంగా వివాహముహూర్తాలు లేకపోయినా స్వామివారి కల్యాణం లోకకల్యాణార్థం ఏటా ఇదేరోజున జరుగుతున్న కార్యక్రమమైనందున అటువంటి పట్టింపులుండవని పండితులు తెలిపారు. రత్నగిరి రామాలయం పక్కనే గల వార్షిక కల్యాణ వేదికపై స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. క్షేత్ర పాలకులు సీతారాముల పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.

Comments