గవర్నర్గా రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేసిన నరసింహన్
హైదరాబాద్ ,మే 3: రాష్ట్ర గవర్నర్గా ఈఎస్ ఎల్ నరసింహన్ రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ నరసింహన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్గా నరసింహన్ను రెండో పర్యాయం కొనసాగిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది చదివి వినిపించారు. గవర్నర్గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నరసింహన్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు, శాసనమండలి విపక్ష నేత దాడి వీరభద్రరావు, డీజీపీ దినేష్ రెడ్డి, గవర్నర్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ..ఉప ఎన్నికలు ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు. గవర్నర్ గా మరో అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ తో తనకు నాలుగు దశాబ్ధాల అనుబంధం ఉందన్నారు. అభివృద్ధి ఫలాలు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకే పరిమితం కాకూడదన్నారు. మలేరియా మందులు గిరిజనులకు అందటం లేదని, ఈ విషయంపై శ్రద్ధ వహిస్తానని గవర్నర్ తెలిపారు.
Comments