మ్రోగిన ' ఉప ' రణభేరి....
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : ఉప ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో ఆరు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలోనూ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి కూడా మార్చి 18వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఫలితాలు మార్చి 21న వెల్లడవుతాయి. తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలతో పాటు పార్టీ ఫిరాయింపు చట్టం ఫలితంగా ఖాళీ అయిన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్,నాగర్కర్నూలు, కొల్లాపూర్, స్టేషన్ఘన్పూర్, కామారెడ్డి, ఆదిలాబాద్, కోవూరు అసెంబ్లీ స్థానాలకు మార్చి 18వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మహబూబ్నగర్ : స్వతంత్ర సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగిన రాజేశ్వర్రెడ్డి మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. నాగర్కర్నూలు: నాగం జనార్దన్రెడ్డి టీడీపీ నుంచి సస్పెండయ్యి, తర్వాత రాజీనామా చేశారు. కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మంత్రి పదవి చేపట్టి, దానికి రాజీనామా చేసి తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ఘన్పూర్: టి. రాజయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని రాజీనామా చేశారు. కామారెడ్డి: గంప గోవర్ధన్ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్: జోగు రామన్న టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి టీడీపీ తరఫున గెలిచి జగన్ పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ పార్టీ నుంచి సస్పెండయ్యారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హుడు కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.
Comments