ఉప ఎన్నికల్లో లెఫ్ట్ రూటు సెపరేటు...!
హైదరాబాద్ ,ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని ఏడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. దీనితో సమైక్యవాదం వినిపిస్తున్న సిపిఎం ఓట్లు తమకు తెలంగాణలో కలిసి వస్తాయనే తెలుగుదేశం పార్టీ ఆశలు వమ్మయ్యే పరిస్థితే ఉంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్, నెల్లూరు జిల్లా కోవూరు లో పోటీ చేసే ఆలోచనలో సిపిఎం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వామపక్షాల మద్దతు తీసుకుని ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఎం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీతో అవగాహనకు రావడం కన్నా క్యాడర్ను నిలుపుకోవడానికి పోటీ చేయడమే మేలన్న భావనతో సిపిఎం నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఆలోచిస్తామని రాఘవులు చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని రాఘవులు స్పష్టం చేశారు. కాగా, ఉప ఎన్నికల్లో తాము ఎప్పుడూ పోటీ చేయలేదని, ఉప ఎన్నికలపై ఈ నెల 21వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలా, సిపిఎంకు ఇవ్వాలా అనే విషయంపై కరీంనగర్లో జరిగే మహాసభలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
Comments