 |
| కొత్తమంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రసాద్కుమార్ ,కొండ్రు మురళీమోహన్ |
హైదరాబాద్, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మూడోసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ముగ్గురితో ముగిసింది. ప్రభుత్వ విప్ కొండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యేలు కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, జి.ప్రసాద్కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఏకంగా సగం మంది మంత్రులు డుమ్మా కొట్టడం కాంగ్రెస్లోచర్చనీయంగా మారిం ది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, వైద్య మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గైర్హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పీఆర్పీ ఎమ్మెల్యే చిరంజీవితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలే కార్యక్రమంలో అధికంగా కన్పించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. మంత్రులు జానారెడ్డి, బొత్స సత్యనారాయణ అసహనంగా కన్పించారు. జనవరి 19న మలివిడత విస్తరణలో గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య మంత్రులుగా ప్రమాణం చేయడం తెలిసిందే. కొండ్రు, ఉత్తమ్, ప్రసాద్ల చేరికతో కిరణ్ కేబినెట్ సంఖ్య 41కి చేరింది. దామోదర రాజనర్సింహ కు అదనపు బాధ్యతగా అప్పగించిన వ్యవసాయ శాఖను మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బదిలీ చేశారు. కన్నా నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖను కొత్త మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి కేటాయించారు. డీఎల్ను ఆరోగ్య శాఖకే పరిమితం చేసి, ఆయన నుంచి తప్పించిన వైద్య విద్యతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను కొండ్రు మురళీమోహన్కు అప్పగించారు. ప్రసాద్కుమార్కు చేనేత, జౌళి శాఖలను కేటాయించారు. కాగా, శాఖల కేటాయింపు పై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments