తొలిరోజే సాగని లోక్ సభ
న్యూఢిల్లీ,నవంబర్ 22: శీతాకాల సమావేశాల తొలిరోజే ప్రత్యేక తెలంగాణ, ఉత్తరప్రదేశ్ విభజనపై లోక్సభ అట్టడుకింది. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. అందుకు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడం, సభ్యుల నిరసనల మధ్య లోక్సభ బుధవారంనాటికి వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్ విభజన అంశంపై సమాజ్వాది పార్టీ సభ్యులు చర్చకు పట్టుపట్టారు. స్పీకర్ మీరాకుమార్ అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమయిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో మళ్లీ వాయిదా పడింది. తిరిగి ప్రారంభకాగానే ప్రత్యేక తెలంగాణ, యుపీ విభజనపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. స్పీకర్ మీరాకుమార్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో, సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెట్టాలంటూ సభ బయట ఫ్లకార్డులతో నిలబడి నిరసన తెలియజేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 'వుయ్ వాంట్ తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. ఇక రాజ్యసభ ప్రారంభకాగానే ఛైర్మన్ హమీద్ అన్సారీ పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ముఖ్మంగా ప్రముఖ సంగీత ధర్శకులు భూపేన్ హజారికాకు సభ ఘనంగా నివాళులర్పించింది. సిక్కిం భూకంప మృతులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు సభ సానుభూతి తెలిపింది. అనంతరం సభ బుధవారం నాటికి వాయిదా పడింది.
Comments