దీపావళి పోయె...బక్రీద్ పోయే...ఇక సంక్రాంతి...
హైదరాబాద్ ,నవంబర్ 4: తెలంగాణపై జనవరిలోగా నిర్ణయం వెలువరిస్తామని, ఈ విషయం రాష్ట్రంలోని తమ పార్టీ నేతలకు తెలుసునని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఆ విషయం తెలిసి కూడా తమ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరడం తొందరపాటు చర్యేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయ నాయకులు తొందరపడి పార్టీలు మారితే తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెలంగాణ వంటి క్లిష్టమైన, సున్నితమైన సమస్య పరిష్కారానికి సహనం, ఓర్పు అవసరమని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు జరుగుతోందని, చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడానికి తమ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సమయంలో తొందరపడి పార్టీలు మారడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ వంటి సమస్యల విషయంలో రాజనీతిజ్ఞత ప్రదర్శించాలని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ చేతులు ముడుచుకుని కూర్చుందని అనడం సరి కాదని, ఆయన అన్నారు.
Comments