Sunday, November 20, 2011

ఇక 'చలి' పార్ల 'మంట' !

న్యూఢిల్లీ,నవంబర్ 21:  మంగళవారం నుంచే ప్రారంభం కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడి వేడిగా జరగనున్నాయి. ధరల పెరుగుదల.. నల్లధనం.. 2జీ.. లోక్‌పాల్.. ఉత్తరప్రదేశ్.. తెలంగాణ.. అంశాలు ఉభయ సభలను కుదిపేయనున్నాయి. ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి సమావేశాల మొదటిరోజే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం వరాల జల్లులు కురిపించనుంది. ఉత్తరప్రదేశ్ విభజన ప్రతిపాదన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలాంటి అంశాలపై వాడివేడిగా చర్చ జరగనుంది.  30 రోజులపాటు జరిగే  సమావేశాల్లో దాదాపు 31 బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో న్యాయవ్యవస్థలో ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు, లోక్‌పాల్‌తోపాటు ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు, లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే బిల్లు, జాతీయ ఆహార భద్రత బిల్లు, మనీ లాండరింగ్ నిరోధక(సవరణ) బిల్లు, అణు నియంత్రణ అథారిటీ బిల్లు, పింఛన్ల రంగంలో విదేశీ పెట్టుబడులకు వీలు కల్పించే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ బిల్లులు ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలు సుమారు 45 అంశాలను లేవనెత్తాలని యోచిస్తున్నాయి. ఇందులో విదేశాల్లో నల్లధనం దాచుకున్నవారి పేర్లు వెల్లడించడం, ఆహార ద్రవ్యోల్బణం, తెలంగాణ, రైతుల ఆత్మహత్యలు, భారత్-పాక్ సంబంధాలు, కాశ్మీర్‌లో పరిస్థితి, మణిపూర్ దిగ్బంధం, వరదలు, పలుచోట్ల మెదడువాపు విజృంభణ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు.. తదితర అంశాలున్నాయి. కాగా, 2జీ ప్రకంపనలు తాజాగా ఎన్డీయేను కూడా తాకడంతో దీనిపై సభలో దుమారం రేగే అవకాశాలున్నాయి. సీబీఐ తాజా దాడులు బీజేపీని ఇరకాటంలోకి నెట్టడంతో దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు పాలకపక్షం పావులు కదుపుతోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...