అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి కన్నుమూత
గౌహతి,నవంబర్ 29: ప్రముఖ అస్సామీ రచయిత్రి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి కన్నుమూశారు. 69ఏళ్ల గోస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 12న కోమాలోకి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 2005 నుంచి ఉల్ఫా ఉగ్రవాదులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో ఇందిరా గోస్వామి మధ్యవర్తిగా వ్యవహరించారు. 1982లో సాహిత్య అకాడమీ, 2000 సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డును ఆమె అందుకున్నారు. అస్సామీల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెబుతూ టుకుంటూ వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికా ఇటీవలే కన్నుమూయగా, ఇప్పుడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి మృతి అస్సామీలకు పెద్ద దెబ్బే. జీవితంలో డిప్రెషన్ను అధిగమించి, ఆత్మహత్య చేసుకోవాలనే కోరికను దిగమింగుతూ జీవించడానికి రచనలు చేసిన ఇందిరా గోస్వామి తన రచనల్లో జీవనశ్వాసను ఒంపారు. ఆమె తన రచనల్లో మహిళలకు, అస్సామీ సమాజ సాంస్కృతిక, రాజకీయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. అస్సామీ సాహిత్యంలో అత్యంత ఉత్తమమైన పురుష పాత్రను చిత్రీకరించిన ఘనత కూడా ఆమెకు దక్కుతుంది. మొత్తంగా అస్సామీల ఉనికిని ఆమె చాటి చెప్పారు. చిన్ననాటి నుంచే ఆమెలో ఆత్మహత్య చేసుకోవాలనే విచిత్రమైన కాంక్ష ఉంటూ వచ్చింది. ఇది ఆమె ఆత్మకథ ది అన్ఫినిష్డ్ ఆటోబయోగ్రఫీ (అసంపూర్ణ ఆత్మకథ) ద్వారా తెలుస్తుంది. షిలాంగ్లో తన ఇంటికి దగ్గరగా ఉన్న క్రినోలైన్ జలపాతంలోకి దూకాలని అనిపించేదట. తన భర్త పెళ్లయిన ఏడాదిన్నరకే కాశ్మీర్లో కారు ప్రమాదంలో మరణించడం ఆమెను విపరీతంగా కృంగదీసింది. ఆమె మరణం భారత సాహితీ రంగానికి కూడా తీరని లోటు.

Comments