ఎలాగైతేనే ఏడాది నెట్టుకొచ్చిన కిరణ్...!

హైదరాబాద్ , నవంబర్ 25:  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి పాలనకు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఏడాది పూర్తయింది.  ఇంతవరకు సమస్యలు అధిగమించడానికే సమయం సరిపోయిందని,  ఇక నుండి అభివృద్ధి పుంజుకుంటుందని ఆయన ఓ టీవీ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు.  తనకు ప్రచారం చేసుకోవడానికి ఓ పేపర్, ఛానల్ లేవని, కాంగ్రెసు పార్టీకి కార్యకర్తలే బలమని, వారే ప్రభుత్వ పథకాల ప్రచారకర్తలని అన్నారు. 2014 ఎన్నికల వరకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే  లక్ష్యంగా ముందుకు సగుతానన్నారు.పార్టీ సీనియర్లు, సహచర మంత్రులతో కలిసి కొత్త పథకాలపై చర్చిస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదో ఒక అడ్డంకి వస్తున్నదని, వీలైనంత త్వరగా వాటిని నిర్వహిస్తామని చెప్పారు.  మంత్రివర్గ విస్తరణ సరైన సమయంలో ఉంటుందన్నారు.  జిల్లాల్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల మధ్య బేధాభిప్రాయాలు వాస్తవమేనని వాటిని అధిగమిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తాను ఎక్కువగా మాట్లాడనన్నారు. బాబు అవిశ్వాసం పెడితే స్వాగతిస్తామని చెప్పారు. సిబిఐ కేసుల విషయంలో ప్రభుత్వం పాత్ర లేదని కోర్టు ఆదేశాల మేరకే దర్యాఫ్తు జరుగుతోందన్నారు. పిసిసి చీఫ్ బొత్సతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ ఓడించలేదు. కానీ కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఓడిపోతుంది. కాబట్టే.. అందరినీ కలిపి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రూపాయికి కిలో బియ్యం ప్రజాకర్షక పథకం అంటే ఒప్పుకోమని,  నిత్యావసర వస్తువుల్లో కీలకమైన బియ్యం రేటు తగ్గితే.. ఆ డబ్బుతో మిగిలిన సరుకులు కొనుక్కోగలరన్న ఉద్దేశంతో ఆ పథకాన్ని అమలు చేస్తున్నామని ,నిత్యావసర ధరల నియంత్రణకు మరో ప్రత్యేక కమిటీని వేస్తామని చెప్పారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు