Tuesday, November 29, 2011

కనిమొళికి ఎట్టకేలకు ఊరట

న్యూఢిల్లీ,నవంబర్ 29:  డీఎంకే ఎంపీ కనిమొళికి ఎట్టకేలకు ఊరట లభించింది. 2జీ కేసులో ఆమెతోపాటు మరో నలుగురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. కిందటివారం ఇదే కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు విధించిన షరతులే ప్రస్తుతం వీరికీ వర్తిస్తాయని జస్టిస్ వీకే షాలి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం నిందితులు రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, తమ పాస్‌పోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. బెయిల్ మంజూరైన వారిలో కనిమొళితోపాటు కలైంగర్ టీవీ చానెల్ ఎండీ శరద్ కుమార్, బాలీవుడ్ చిత్ర నిర్మాత కరీం మొరానీ, కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్లు రాజీవ్ అగర్వాల్, ఆసిఫ్ బల్వా ఉన్నారు. టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహురా బెయిల్ పిటిషన్‌పై మాత్రం కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ముందుగా సీబీఐ అభ్యంతరాలకు రాత పూర్వక వివరణ ఇచ్చిన తర్వాత బెహురా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తరఫు న్యాయవాది ఆమన్ లేఖికి జస్టిస్ షాలి చెప్పారు. కాగా,  2జీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా ఇప్పటిదాకా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించకపోవడం గమనార్హం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...