Friday, November 4, 2011

గాలి కేసులో సి.బి.ఐ. ఎదుట హాజరైన జగన్

బాబునూ విచారించండి...  
హైదరాబాద్ ,నవంబర్ 4:  ఓబుళాపురం గనుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుక్రవారం  సీబీఐ ఎదుట  సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ,  2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు. ఈ  వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని  సీబీఐకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రామ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత తనను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందంటే... ఇందులో తనకు సంబంధం లేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా సాక్షిగానే విచారించిందన్నారు. కాగా, జగన్మోహన రెడ్డి ఇచ్చిన జిఓ కాపీని పరిశీలిస్తామని సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చెప్పారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధంలేదని జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆ కంపెనీ యజమాని గాలి జనార్దన రెడ్డిని వ్యక్తిగతంగానే కలిసినట్లు జగన్ చెప్పారన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...