రాజీనామాల పై మూడో " సారీ " !
హైదరాబాద్,నవంబర్ 29: శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభ మవుతున్న తరుణంలో 61 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. పార్టీ మారిన మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలను ఆమోదించారు. కొండా సురేఖ (పరకాల), కుంజా సత్యవతి (భద్రాచలం) రాజీనామాలను మాత్రం పెండింగ్లో ఉంచారు. కాగా, మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి) రాజీనామాను కూడా పెండింగ్లో ఉంచారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), రాజయ్య (స్టేషన్ ఘన్పూర్), టీడీపీ సభ్యులు గంపా గోవర్ధన్ (కామారెడ్డి), జోగు రామన్న (ఆదిలాబాద్) రాజీనామాలను మాత్రం స్పీకర్ ఆమోదించారు. నాగం జనార్దనరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిల రాజీనామాలను ఇప్పటికే ఆమోదించడం, మహబూబ్నగర్ ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో మొత్తం అసెంబ్లీలో ఖాళీల సంఖ్య 7కు చేరింది. మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి (టీడీపీ), శోభానాగిరెడ్డి (పీఆర్పీ) లతో పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి (కాంగ్రెస్) ల రాజీనామాలను తిరస్కరించినప్పటికీ వారిపై అనర్హత పిటిషన్లు యథావిధిగా పరిశీలనలో ఉంటాయని స్పీకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించడం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది మూడోసారి.
Comments