Monday, November 21, 2011

పంతం నెగ్గించుకున్న మాయావతి

యు.పి.విభజన పై అసెంబ్లీ తీర్మానం  
లక్నో,నవంబర్ 21: ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ  ముఖ్యమంత్రి మాయావతి సర్కార్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కాగా రాష్ట్ర విభజనను ఎస్పీ, బీజేపీలు వ్యతిరేకించాయి.  ఈరోజు  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర విభజన అంశంపై సభలో దుమారం రేగింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో సభ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే అధికార బీఎస్పీ రాష్ట్ర విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విపక్ష సభ్యుల వ్యతిరేకత మధ్యే తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానం ఆమోదంతో ఎట్టకేలకు మాయావతి తన పంతం నెగ్గించుకున్నారు. అంతకు ముందు మాయా సర్కార్ మైనార్టీలో పడిందంటూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ప్రతిపక్షాలకు సరిపడా సంఖ్యాబలం లేకపోవటంతో తీర్మానం వీగిపోయింది.
 కేంద్రానికి పంపుతాం:మయావతి
అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు  ముఖ్యమంత్రి మాయావతి తెలిపారు. యూపీ విభజన రాజకీయ ఎత్తుగడ కాదన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే తాము విభజనకు ప్రయత్నించటం లేదని... 2007 నుంచి రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే మళ్లీ తీర్మానం చేయాల్సి వచ్చిందన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని విపక్షాలు కోరుకోవటం లేదని మాయ మండిపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలన్ని దళిత వ్యతిరేకులేనని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ విభజనపై పోరాటం జరుగుతోందని మాయా తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణపై కూడా కాంగ్రెస్ తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...