Thursday, October 6, 2011

స్టీవ్ జాబ్స్ గురించి...

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: స్టీవ్ జాబ్స్ గా పేరొందిన  స్టీవెన్ పాల్ జాబ్స్ కంప్యూటర్. వినోదం పరిశ్రమలలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే  గొప్ప వ్యాపారవేత్తగా ఖ్యాతి గాంచారు. యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌ కు  సి.ఇ.ఒ. గా పనిచేశార్.  పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్‌కు కూడా కొద్దికాలం  సి.ఇ.ఒ. గా ఉన్నారు.  1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన కొద్ది రోజులకే ఆయనను పాల్ - క్లారా జాబ్స్ దంపతులు దత్తత తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో  రీడ్ కాలేజీలో చేరాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయిన భారతదేశాన్ని సందర్శించడానికి అవసరమయిన డబ్బు కోసం ఒక వీడియో గేమ్స్ కంపెనీలో చేరాడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత తన కాలేజ్ ఫ్రెండ్ అయిన డేనియల్‌తో కలసి భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి అదే కంపెనీలో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ తన చిరకాల మిత్రుడు అయిన స్టీవ్ వోజ్‌నైక్‌తో కలసి కంప్యూటర్ చిప్‌ల గురించి పనిచేసి కొత్త విషయాలు కనుగొన్నాడు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో  ఐ.పి.ఒ. వల్ల జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టిన  మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో నెక్స్ట్  అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు నెక్స్ట్  ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక  సి.ఇ.ఒ. గా గా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసాడు. ఆ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పనిలోనుండి తొలగించాడు. కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి  సి.ఇ.ఒ.  అయ్యాడు.
కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్ కు దక్కుతుంది. ఆపిల్ కంపెనీ  సి.ఇ.ఒ. గా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే సి.ఇ.ఒ. గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది.  2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు. 1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి, పంపిణీ చేయడానికి డిస్నీ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ వందల మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి. డిస్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత యేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ మరో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడు డిస్నీకి వచ్చిన కొత్త సి.ఇ.ఒ. గ పిక్సర్‌ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ-పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే ఆరుగురు సభ్యుల కమిటీలో జాబ్స్ ఒకడుగా ఉంటున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...