
హైదరాబాద్,అక్టోబర్ 28: ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు సతీమణి పద్మ శుక్రవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన పద్మను కుటుంబ సభ్యులు మంగళవారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. దాసరి దర్శకత్వం వహించిన పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా పద్మ మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments