అజాద్ నోట అదే మాట... ఏకాభిప్రాయం తప్పదు
న్యూఢిల్లీ,జులై 12: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏకాభిప్రాయం అవసరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్ మరోసారి స్పష్టం చేశారు. ఏకాభిప్రాయం లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నారు. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయవలసిన అవసరం ఉందన్నారు. అటు శాసనసభ్యుల మధ్య, ఇటు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు శాసనసభ తీర్మానాల తరువాతే ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పూర్తి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు సూత్రాల అమలు సాధ్యం కావన్నారు. ఆ కమిటీ సరైన పరిష్కారం చూపలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య మరింత జటిలమైందన్నారు. రాష్ట్ర విభజనను సీమాంధ్రులు వ్యతిరేకిస్తున్నారని, వారి మద్దతు లేకుండా తెలంగాణను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ ఏవిధంగా ఉందో, సీమాంధ్రలోనూ ఉద్యమాలు నడుస్తున్నాయని ఆయన అన్నారు.
Comments