ప్రధానిని, చిదంబరాన్ని కేసులోకి లాగిన రాజా
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులోకి టెలికం మాజీ మంత్రి ఎ. రాజా ప్రధాని మన్మోహన్ సింగ్ను, ప్రస్తుత హోం మంత్రి పి. చిదంబరాన్ని లాగారు. ఆయన సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీ ముందు తన వాదన వినిపించారు. స్వాన్, యూనిటెక్ ఈక్విటీ అమ్మకం విషయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు తెలుసునని ఆయన చెప్పారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2జి స్పెక్ట్రమ్ వేలం జరిగిందని ఆయన చెప్పారు. ఈక్విటీ అమ్మకం తప్పు కాదని చిదంబరం ప్రధాని ఎదుటే చెప్పారని, అది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పనికి వస్తుందని చిదంబరం అన్నారని ఆయన అన్నారు. తాను చెప్పే విషయాలు నిజం కాదని ప్రధాని చెప్పగలరా అని ఆయన అడిగారు. 2003లో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు. ఎన్డిఎ ప్రభుత్వం, తమ ప్రభుత్వం రూపొందిచిన విధానాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు. ప్రభుత్వ విధానం తప్పయితే తనకు ముందు ఆ విధానాన్ని అమలు చేసినవారు కూడా జైలుకు రావాల్సిందేనని ఆయన అన్నారు.
Comments