ఇక ఐక్య ఉద్యమాలు: జానారెడ్డి

హైదరాబాద్,జులై 7:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ జెఎసి నేత కోదండరామ్‌తో భేటీ అనంతరం ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీ పరిణామాలను జానా రెడ్డి తనకు వివరించారని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ ఉధృతికి చేపట్టాల్సిన చర్యలపై జానారెడ్డితో చర్చించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము రాజీనామాలు చేశామని జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. రాజీనామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తర్జనభర్జనలు పడుతోందని, చర్చలు సాగుతున్న సమయంలో ఆందోళన కలిగించే చర్యలు చేపట్టకూడదని ఆయన అన్నారు. దశలవారీగా ఆందోళనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం సాధించి తీరుతామని ఆయన అన్నారు. రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, మందా జగన్నాథం, రాజయ్య, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం సాయంత్రం జానా రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసమే తాము రాజీనామాలు చేశామని కేశవ రావు అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు