ఓయులో నాగం, గన్‌పార్కు వద్ద టిడిపి నేతల అరెస్టు

హైదరాబాద్,జులై 5: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి బంద్  పిలుపులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని, అసమ్మతి టిడిపి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులతో దీక్షను విరమింపజేయడానికి హరీశ్వర్ రెడ్డితో కలిసి నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని  అరెస్టు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు విద్యాలయం నుండి బయటకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు గేట్లు వేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు లోపలకు రావద్దంటూ విద్యార్థులు హెచ్చరించారు.
కాగా అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ తరలించారు. తెలుగుదేశం నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు