తొలి టెస్టులో గెలుపు మనదే
కింగ్స్టన్ ,జూన్ 24 : తొలి టెస్టులో ధోని సేన 63 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 68.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటయింది. ఓవర్నైట్ స్కోరు (131/3)తో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు... తొలి సెషన్లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్ మెన్ డారెన్ బ్రేవో (89 బంతుల్లో 41; 7 ఫోర్లు), చందర్పాల్ (73 బంతుల్లో 30; 4 ఫోర్లు) నాలుగో వికెట్కు 68 పరుగులు జోడించారు. అయితే ప్రవీణ్ కుమార్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ అవుట్ చేశాడు. లంచ్ విరామానికి ముందే తొమ్మిదో వికెట్ను కోల్పోయినా... ఎడ్వర్డ్స్ (54 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), బిషూ (33 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడటంతో మ్యాచ్ రెండో సెషన్ వరకూ సాగింది. పదో వికెట్కు ఎడ్వర్డ్స్తో కలిసి 39 పరుగులు జోడించాక బిషూ... రైనా బౌలింగ్లో బౌల్డయ్యాడు. దీంతో భారత్ విజయం ఖరారయింది. ప్రవీణ్, ఇషాంత్ మూడేసి వికెట్లు తీసుకోగా.. మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీ చేసిన ద్రవిడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు మంగళవారం నుంచి బార్బడోస్లో జరుగుతుంది.
Comments