టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కన్నుమూత
వరంగల్,జూన్ 21: : తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (76) మంగళవారం ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు.ప్రొఫెసర్ జయశంకర్ 1934లో ఆగస్టు 6న హన్మకొండలో జన్మించారు. బెనారస్, అలీగడ్ విశ్వవిద్యాలయాల నుంచి జయశంకర్ ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి ఆచార్యులుగా, ఉప కులపతిగా, సీఫెల్ రిజిష్ట్రార్గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఆయన కీలకపాత్ర వహించారు. జయశంకర్ మృతివార్తను తెలుసుకున్న తెలంగాణవాదులు శోకసముద్రంలో మునిగి పోయారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు కంట కన్నీరు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా నిలిచిన జయశంకర్ మృతి ఆ పార్టీతో పాటు.. తెలంగాణ ఉద్యమానికి తీరని లోటుగానే భావించాలి.

Comments