చంద్రబాబు వ్యూహాత్మక ' అవిశ్వాసం '...?
హైదరాబాద్,జూన్ 2 : ఈ నెల 4 లేదా 6వ తేదీన బలపరీక్షకు సిద్ధపడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా చంద్రబాబు రిస్క్ చేసి రాష్ట్రప్రభుత్వం పై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సవాల్ విసురుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా తానే పాచిక విసిరారు. విశ్వాస తీర్మానం ప్రతిపాదించి నెగ్గితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలదొక్కుకుంటారని, ముఖ్యమంత్రి ప్రతిష్ట పెరుగుతుందని, కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం దక్కకుండా ముందుగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చంద్రబాబు భావించినట్టు కనబడుతోంది. దీనివల్ల తాము కాంగ్రెసుతో కుమ్మక్కు అయినట్టు వైయస్ జగన్ చేస్తున్న ఆరోపణలను తిప్పీకొట్టడం కూడా బాబు వ్యూహం గా కనబడుతోంది. కాగా, స్పీకర్ పదవికి పోటీ పెట్టే విషయంపై కూడా చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారు. అయితే, స్పీకర్ పదవికి అభ్యర్థిని పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ) గానీ మద్దతు ఇవ్వకపోవచ్చునని, అందువల్ల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఆ రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన ఎంత మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనేది ఓ సవాల్ అవుతుందని, వారు కాంగ్రెసు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే జగన్ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నారని విమర్సించి ఇరకాటంలో పెట్టడానికి వీలవుతుందన్నది చంద్రబాబు ఆలోచనేమో...
Comments