ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మృతి
హైదరాబాద్,జూన్ 7: ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నింస్ లో చికిత్స పొందుతు మృతి చెందారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో 31 మార్చి, 1923 న జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశారు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి నాట్యంకోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నారు. శ్రీ వేంకటేశ్వర కల్యాణం 'కుమార సంభవము మేఘ సందేశం మొదలైన నాట్య ప్రదర్శనలు ఇచారు. . నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర , ఆంధ్రులు - నాట్యకళారీతులు విశేష ప్రజాదరణ పొందాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కి చైర్మన్గా పని చేసిన నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నారు. . ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయం చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండులు. భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్ద్ తో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి.

Comments