
హైదరాబాద్,జూన్ 4 : అసెంబ్లీ స్పీకర్గా నాదెండ్ల మనోహర్ ఎన్నికయ్యారు. డివిజన్ పద్ధతిలో జరిగిన ఎన్నికలో నాదెండ్ల మనోహర్ కు 158మంది సభ్యులు మద్దతు తెలపగా, టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తికి 90మంది మద్దతు పలికారు. శాసనసభ ఉప సభాపతిగా భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. డివిజన్ పద్ధతి ద్వారా ఆయనను సభ్యులు ఎన్నుకున్నారు. భట్టి విక్రమార్కకు 164మంది సభ్యులు మద్దతు తెలిపారు. టీడీపీ అభ్యర్థి సుద్దాల దేవయ్యకు 88 ఓట్లు లభించాయి. కాగా, శాసన మండలి చైర్మన్ గా చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ గా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా తమ బలాన్ని నిరూపించుకున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులోలేక సభకు హాజరు కాలేకపోయారని ఆయన చెప్పారు. వారు కూడా వస్తే తమ బలం ఇంకా పెరిగేదన్నారు. తెలుగుదేశం అవిశ్వాసంపై స్పీకర్ దే తుది నిర్ణయం అని ముఖ్యమంత్రి చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం అవిశ్వాసంపై ప్రస్తావన లేకుండానే సభ వాయిదా పడింది. దీనికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు.
Comments