అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు
ముంబై,మే 24: అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఎంపికయిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ద్వారకా తిరుమలకు చెందిన శ్రీచైతన్య విద్యార్థి పృథ్వీ తేజ , హైదరాబాద్కు చెందిన బుర్లె సాయి కుమార్ ఈ ఘనత సాధించారు. జూలై 10 నుంచి 18 వరకు బ్యాంకాక్లో నిర్వహించే అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో వీరు పాల్గొంటారు. ఈసారి 80 దేశాల విద్యార్థులు ఒలింపియాడ్లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆణిముత్యాలను వెలికితీసేందుకు 1967లో అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ను స్థాపించారు. దేశం నుంచి ఎంపికైన మరో ముగ్గురిలో జైపూర్(రాజస్థాన్)కు చెందిన నిశీత్ లహోటీ, కోటా (రాజస్థాన్)కు చెందిన శుభం మెహత్రా, బటిండా(పంజాబ్)కు చెందిన సుమేఘ గార్గ్ ఉన్నారు. వీరందరికన్నా పృథ్వీ తేజ్ చిన్న వయస్కుడు కావడం విశేషం.
Comments