అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ రాజీనామా
న్యూఢిల్లీ,ఏప్రిల్ 29: భారత్లో అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ (54) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దౌత్యపరంగా అత్యంత కీలకమైన పదవిలో రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయేందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2009 మేలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆయనను భారత్లో రాయబారిగా నియమించారు. అప్పటి నుంచి రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. ' రెండేళ్లపాటు మాత్రమే భారత్లో రాయబారిగా కొనసాగుతానని ఈ పోస్టు బాధ్యతలు స్వీకరించే ముందే ఒబామాకు చెప్పాను' అని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా సంబంధాలు అంతర్జాతీయ భాగస్వామ్యం దిశగా సానుకూల మార్గంలో ముందుకెళ్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలకు ఎలాంటి హద్దులూ లేవన్నారు. కీలకమైన ద్వైపాక్షిక సంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా బలోపేతం చేయడంలో విజయం సాధించినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించా రు. అయితే భారత వైమానిక దళానికి అవసరమైన యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో అమెరికా బిడ్ ఎంపిక కావకపోవడం పట్ల తీవ్ర నిరాశ చెందామని రోమెర్ పేర్కొన్నారు.

Comments