
కడప, ఏప్రిల్ 15: ఉప ఎన్నిక జరగనున్న కడప పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్కు ఆయన శుక్రవారం ఉదయం తన నామినేషన్ పత్రాలు అందచేశారు. వైఎస్ జగన్కు మద్దతుగా పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలి వచ్చారు. కాగా పులివెందుల శాసనసభ స్థానానికి శనివారం వైఎస్ విజయలక్ష్మి నామినేషన్ వేయనున్నారు. కాగా, పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై కాంగ్రెస్ అబ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆమె మరిది వివేకానంద రెడ్డి మంత్రి పదవికి చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆమోదించి, గవర్నర్కు పంపించారు. గవర్నర్ కూడా వివేక రాజీనామాను ఆమోదించారు. ఇలా వుండగా కడప లోక్ సభ స్థానానికి ఇప్పటి వరకు 9 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. పులివెందుల శాసన సభ స్థానానికి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారు మంత్రులైనా వదిలిపెట్టేదిలేదని ఆయన హెచ్చరించారు. ఉప ఎన్నికలకు ఆరుగురు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 7799 మందిపై బైడోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనధికార నగదు బదిలీపై ఇన్ కంటాక్స్ అధికారులకు గానీ, 1800-4251788 ఫోన్ నంబర్ కు గానీ సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు.
Comments