నూతనప్రసాద్ ఇక లేరు
హైదరాబాద్,మార్చి 30 : ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు. అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., ‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్చైర్కే పరిమితం అయ్యారు. 1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నూతన్ ప్రసాద్ దహన సంస్కారాలు ఎర్రగడ్డ స్మశానవాటికలో నిర్వహించారు. నూతన ప్రసాద్ ఇంటి నుంచి స్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. బంధువులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Comments