'సమితి' లో సంగీత ఝరి
న్యూయార్క్,మార్చి 13: శాంతిసౌథంలో మథుర సంగీత ధ్వనులు మారుమ్రోగాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన భవనంలో కమనీయ కర్నాటక సంగీత కచేరీ కన్నుల పండువగా సాగింది. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రమణ్యమ్ తన వాద్యగాన మాధుర్యంతో సభ్య ప్రతినిధులకు భారతీయ సంప్రదాయ సంగీత సంస్కృతిని పరిచయం చేశారు. గతంలో ఐక్యరాజ్యసమితిలో సంగీత సామ్రాజ్ఞి ఎమ్ఎస్. సుబ్బలక్ష్మి కర్నాటక సంగీతం ఆలపించి తన గానమాధుర్యంతో అందరినీ మంత్రముగ్థులను చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఐక్యరాజ్యసమితిలో భారత్ తాత్కాలిక సభ్య హోదా పొందిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కర్నాటక సంగీత కార్యక్రమంలో వయొలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రమణ్యమ్ తన కుమారుడు అంబితో కలిసి అద్భుతమైన రాగాలను ఆలపించారు. 90 నిమిషాల పాటు సాగిన ఈ సంగీతఝరి 500 మంది ప్రేక్షకులను పారవశ్యంలో ముంచెత్తింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్-కి మూన్, ఐరాస ప్రథమ మహిళ, సభలో భారత ప్రతినిధి హర్దీప్సింగ్పురి, ఉప ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మంజీవ్ సింగ్ పురి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments