గులాంనబీ ఆజాద్పై కాకా ఫైర్
హైదరాబాద్,, మార్చి 6: కాంగ్రెస్ వృద్ధనేత జి.వెంకటస్వామి (కాకా) మళ్లీ తన అసమ్మతి గళాన్ని విప్పారు. మొన్న సోనియాగాంధీపై నిప్పులు చెరిగిన ఆయన నేడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్పై విరుచుకుపడ్డారు. విభజించి పాలించడంలో ఆయన మొనగాడని ధ్వజమెత్తారు. కేసీఆర్, నరేంద్రకు పదవులిచ్చి తెలంగాణ రాకుండా చేసిన మహాపురుషుడు ఆయనేనని విమర్శించారు. శనివారం సాయంత్రం తన నివాసంలో కాకా మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, పేర్కొన్నారు. ‘‘ఎన్నో ఏళ్లుగా నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కొనసాగుతున్నా. ఎప్పుడు మీటింగ్ జరిగినా తెలంగాణ గురించి ప్రస్తావిస్తే తరువాత మాట్లాడదాంలే...అంటూ వాయిదా వేసేవారు. ఇక లాభం లేదనుకుని ఒకసారి మీటింగ్లో తెలంగాణ ఇస్తరో.. ఇయ్యరో చెప్పాలి. లేకుంటే వాకౌట్ చేసి పోతానని గట్టిగా అడిగిన. వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ నా వద్దకొచ్చి చేతులు పట్టుకుని అట్లా చేయొద్దని ఆపారు. అప్పటి నుంచి నేను సీడబ్ల్యూసీలో ఉంటే తెలంగాణపైనే మాట్లాడతానని అనుకున్నారేమో! నన్ను తీసేసిండ్రు’’ అని కాకా చెప్పారు. అయినప్పటికీ తనకేమాత్రం బాధలేదని, సంతోషంగానే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేయాలని ఇది వరకే భావించానన్నారు.
Comments