జయప్రకాశ్ నారాయణ పై టీఆర్ఎస్ దాడి
హైదరాబాద్,ఫిబ్రవరి 17 : లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం జేపీ విలేకర్లతో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. జయప్రకాశ్ నారాయణపై జరిగిన దాడిని అద్దుకున్న కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావ్పై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. దాడి గురించి జయప్రకాశ్ నారాయణ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారు. దాంతో డిప్యూటీ స్పీకర్ వైద్యులను పిలిపించి జేపీకి పరీక్షలు చేయించారు. స్పీకర్ ఛాంబర్లో జేపీని పలువురు మంత్రులు, చిరంజీవి పరామర్శించారు. దాడి జరిగిన తర్వాత లోకసత్తా కార్యాలయంలో జయప్రకాష్ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సతమతమౌతున్న ప్రజాస్వామ్య విలువలకి ఈ దాడి పరాకాష్ట అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల భవిష్యత్కు, యువత భవిష్యత్ కోసం, సహజ వనరుల పంపిణి కోసం లోకసత్తా కట్ట్టుబడి ఉందని జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు కృష్ణా ఫేజ్-3 గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందటే ఆ ఘనత లోకసత్తాదేనన్నారు. కాగా, సిద్దిపేటలో మెదక్ జిల్లా లోకసత్తా అధ్యక్షుడు శ్రీనివాస్పై తెలంగాణవాదులు దాడి చేశారు. జయప్రకాశ్ నారాయణపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టిన శ్రీనివాస్పై తెలంగాణవాదులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన శ్రీనివాస్ను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలావుండగా, లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావ్లపై దాడిని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ తీవ్రంగా స్పందించింది. దాడికి నిరసనగా శుక్రవారం సీమాంధ్ర విద్యాసంస్థల్ని మూసివేయాలని పిలుపునిచ్చింది.

Comments