దీక్ష విరమించిన జగన్
హైదరాబాద్ ,ఫిబ్రవరి 24: విద్యార్థుల ఫీజుల సాధన కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన మాజీ ఎంపీ వైఎస్ జగన్ గురువారం దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ధోరణితో 25 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష చేస్తున్న తన వద్దకు ప్రభుత్వ దూతలు రాలేదన్న బాధలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. మానవతా దృక్పథంలో ఆలోచన చేసిఈ పథకానికి కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీక్ష విరమించిన తర్వాత జగన్ అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడు, నాలుగు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం జగన్ తన నివాసానికి చేరుకున్నారు.
Comments