ధరల పెరుగుదలకు నిరసనగా చంద్రబాబు సైకిల్ యాత్ర
హైదరాబాద్,జనవరి 22: పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. హైదరాబాదులో చంద్రబాబు సికింద్రాబాదులోని మోండా మార్కెట్లో వినియోగదారులను, వ్యాపారులను కలుసుకుని వారి కష్టాలు విన్నారు. అక్కడి నుంచి ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి చేరుకోవడానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఐదు కిలో మీటర్ల మేర ఆయన సైకిల్ తొక్కారు. ఆయనతో పాటు వేయి సైకిళ్లపై నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. ధరలను అదుపు చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిపోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు నిరసనగా తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని, ధరలు తగ్గించేవరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలకు అధికారంలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు.

Comments