క త్రినా, ప్రియాంక ఇళ్లపై ఐటీ దాడులు
ముంబై,జనవరి 24: ప్రముఖ బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోమవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వారి కార్యాలయాలు, కార్యదర్శుల ఇళ్లతోపాటు 17 చోట్ల ఉదయం 7.30 గంటలకు ఏకకాలంలో ప్రారంభమైన దాడులు సాయంత్రం దాకా కొనసాగాయి. ప్రకటనలు, విదేశీ ఒప్పందాలు, అతిథి పాత్రలు, వ్యక్తిగతంగా ఫంక్షన్లకు హాజరవడం ద్వారా వచ్చిన ఆదాయానికి వారు పన్ను చెల్లించలేదని అనుమానిస్తున్నట్లు ఓ ఐటీ అధికారి వెల్లడించారు. దాడులను కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. నగరంలో బాంద్రాలోని గుల్దేవ్ సాగర్ బిల్డింగ్లో కత్రినా నివసిస్తున్న అపార్టుమెంటు, ఆంథేరీ వెస్ట్, వర్సోవాలోని రాజ్ క్లాసిక్ బిల్డింగ్లోని ప్రియాంక నివాసాలపై దాడులు కొనసాగినట్లు చెప్పారు. లోఖండ్వాలాలో ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా, ఆమె కార్యదర్శి చాంద్ మిశ్రా నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ ఇల్లు, ఆయన కంపెనీ ‘బ్లింగ్’ కార్యాలయంలో కూడా దాడులు జరిపినట్లు వెల్లడించారు.
Comments