Friday, December 17, 2010

దడ దడలాడిస్తున్న వికీలీక్స్ ...

న్యూఢిల్లీ: 'ప్రభుత్వాలను బహిరంగం చేస్తాం' అన్న నినాదంతో పనిచేస్తున్న లాభాపేక్షలేని ఒక స్పచ్ఛంద సంస్థ వికీలీక్స్. అందరికీ అందుబాటులోలేని ప్రభుత్వ పత్రాలను సేకరించి, స్వీకరించి ఈ సంస్థ ప్రచురిస్తుంది. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అస్సాంజ్ సారథ్యంలో సన్‌షైన్ ప్రెస్ ఈ వెబ్‌సైట్ ను ప్రారంభించింది. తైవాన్, యూరప్, ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాలకు చెందిన సాంకేతిక నిపుణులు, రాజకీయాశ్రయం పొందిన చైనీయులు, జర్నలిస్టులు, గణితశాస్త్రవేత్తలు ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు.  ఆసియా ఖండంలోని, మాజీ సోవియట్ కూటమిలోని దేశాలు, ఆఫ్రికా ఖండం, మధ్యప్రాచ్యంలోని నిరంకుశ రాజ్యాలు చేస్తున్న నిరంకుశ కార్యకలాపాలను, అణచివేత చర్యలను ప్రపంచ ప్రజలకు బహిర్గత పర చాలన్న ప్రాథమిక లక్ష్యంతో వికీలీక్స్ ఏర్పడింది.
తమ ప్రభుత్వాల, కార్పొరేట్ సంస్థల అనైతిక ప్రవర్తన గురించి ఏ ప్రాంత ప్రజలు పత్రాలు అందజేసినా  కూడా ఈ వెబ్‌సైట్ ప్రచురిస్తుంది. మొదటగా 'చట్టాలకతీతమైన సంహారాలు, అదృశ్యాలు' అని కెన్యా 'జాతీయ మానవ హక్కుల కమిషన్' నివేదికను వికీలీక్స్ ప్రచురించింది. ఇరాక్‌లో అమెరికా సైన్యం దాదాపు లక్షన్నర మంది అమాయక పౌరులను ఊచకోత కోసింది. 2007లో అమెరికా సైన్యం చేస్తున్న అమానుష మారణకాండకు సంబంధించిన దృశ్యాలను 'కొల్లేటరల్ మర్డర్' పేరుతో 2010లో వికీలీక్స్ వెబ్‌సైట్‌లో పెట్టారు. దాంతో పాటు 'ఇరాక్ వార్ లాగ్స్' అని 4 లక్షల డాక్యుమెంట్లను కూడా వికీ ప్రచురించింది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ సోషలిస్టు స్వప్నం ఆవిరవడంతో అమెరికా ప్రపంచ సంరక్షకుడుగా, ప్రపంచ పోలీసుగా అవతరించింది.అమెరికా దాని మిత్ర దేశాలకు వికీలీక్స్ సింహస్వప్నంగా మారింది. ప్రపంచ దేశాల దౌత్య సంబంధాల్లో నెలకొన్న కుట్రలు, కుయుక్తులు, అమానవీయ కార్యకలాపాలు, హక్కుల హననాలు బహిరంగమవుతుండడంతో అమెరికాతోసహా పలు పాశ్చాత్య  దేశాల ప్రజాస్వామ్య స్వభావం ప్రపంచానికి అర్థమవుతోంది. రహస్య పత్రాలను వికీలీక్స్ ప్రచురించడం ఒక గొప్ప సమాచార విప్లవంగా ప్రపంచ ప్రజాస్వామికవాదులు కీర్తిస్తున్నారు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాలలో అమెరికా అనుసరించిన కుట్రపూరిత, దుర్మార్గ విధానాలను ధృవపరచే పత్రాలను బయటపెట్టడంతోపాటుగా ఆ దేశ విదేశ వ్యవహారాలలోని లొసుగులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో కాలంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 'తనకు తానుగా చంకలు గుద్దుకుంటూ ముందుకొస్తున్న ఆశావహ దేశం'గా విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ మన దేశంపై చేసిన వ్యాఖ్యానాలను వెల్లడించే పత్రాలను సైతం వికీలీక్స్ ప్రచురించింది.  అలాగే తాలిబాన్ అణచివేత కోసం పాకిస్థాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థికసహాయం భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు, తాలిబన్లకు చేరుతోందని అమెరికా సైనిక, అధికార వర్గాలు భావిస్తున్న కీలక పత్రాలను సైతం వికీ విడుదల చేసింది.
లాటిన్ అమెరికా మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకునేందుకు, అమెరికా ప్రభుత్వం, సీఐఏ, దాని కార్పొరేట్ సంస్థలు ఆయా దేశాల ప్రజా ప్రభుత్వాలను కూల్చేందుకు పన్నిన పన్నాగా లు, కుట్రలకు సంబంధించిన పత్రాలను లక్షల సంఖ్యలో ప్రచురించింది. వెనిజులా, క్యూబా దేశాధినేతలను హత్య చేసేందుకు జరిగిన కుట్ర రహస్యాలు వెల్లడయ్యాయి. ఉత్తర కొరియాను నియంత్రించే విషయంలో అమెరికా, చైనాల మధ్య కుదిరిన రహస్య ఒప్పంద పత్రాలను, చివరికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, ఆయన సిబ్బందిపైన అమెరికా ప్రభుత్వం గూఢ చర్యానికి పాల్పడింది.వికీలీక్స్ చేతికి అధికారిక రహస్య పత్రాలు చిక్కిన దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఆ వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా విరుచుకుపడ్డాయి అవన్నీ అసత్యాలని అరచి గగ్గోలు పెట్టాయి.

   ఇక తాజాగా  ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి సంబంధించిన రహస్యాలను వికీలీక్స్ బయటపెట్టింది.   భారతదేశంలో అమెరికా రాయబారి టిమోతి రీమోర్స్ తో రాహుల్ గాంధీ జరిపిన సంభాషణను వికీలీక్స్ వెల్లడించింది. లష్కరే తోయిబా కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదకరంగా పరిణమించిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ గ్రూపుల పెరుగుదల వల్ల ముస్లింలతో మతపరమైన, రాజకీయపరమైన ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందు సందర్భంగా రాహుల్ కు, రిమోర్ కు మధ్య సంభాషణ జరిగింది.లష్కరే తోయిబాకు దేశంలోని కొన్ని ముస్లిం గ్రూపుల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వంటి సంఘటిత హిందూ నాయకులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ గ్రూపుల నుంచి దేశ అంతర్గత భద్రతకు ముప్పు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన రాహుల్ గాంధీ తిమోతి రిమోర్స్ తో జరిపిన సంభాషణపై  వికీలీక్స్ వెల్లడించిన వివరాలు కలకలం సృష్టిస్తున్నాయి.      

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...