చిక్కుల్లో 'స్వాతీ'' !

హైదరాబాద్,డిసెంబర్ 15: లక్షలాది మంది పాఠకుల చేతుల్లో అలంకారంగా ఉంటూ వస్తున్న స్వాతి వారపత్రిక భవిష్యత్తు చిక్కుల్లో పడింది. తన పత్రిక 'స్వాతీ' నే తన ఇంటి పేరుగా మార్చుకుని స్వాతి బలరామ్ గా ప్రసిద్ధుడైన  వేమూరి బలరామ్ కు కుటుంబమే ఎదురు తిరిగింది.  వివిధ వారపత్రికలు రాజ్యమేలుతున్న సమయంలో  వేమూరి బలరామ్ 'స్వాతీని  ప్రారంభించారు.  పోటీని తట్టుకుని  వార పత్రిక అంటే స్వాతి ఒక్కటే అన్నంతగా తీర్చిదిద్దారు. అలాంటి పత్రిక  ఆస్తి తగాదాల వల్ల ఈరోజు చిక్కుల్లో పడింది. స్వాతి కార్యాలయాన్ని ఇటీవల అల్లుడి సహాయంతో బలరామ్ కూతురు, భార్య స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సహకారంతో వారు బలరామ్ లేని సమయం చూసి స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తన కార్యాలయం స్వాధీనంపై వేమూరి బలరామ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తన అల్లుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేమూరి బలరామ్ అల్లుడు అనిల్ కుమార్ ఆదాయం పన్ను శాఖలో అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు. తన అధికారాన్ని వినియోగించి అనిల్ కుమార్ విజయవాడ నగర పోలీసు కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారని, దీంతో పోలీసు కమిషనర్ తన భార్యకు, కూతురుకు అనుకూలంగా వ్యవహరించారని వేమూరి బలరామ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన అభ్యంతరం చెప్పారు. తమ వ్యవహారంలో పోలీసుల జోక్యాన్ని నివారించాలని ఆయన హైకోర్టు అభ్యర్థించారు. తనను తన కార్యాలయంలో ప్రవేశించడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు. తన కార్యాలయం నుంచి భార్య, అల్లుడు, కూతురు తీసికెళ్లిన కీలక పత్రాలను తనకు తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు