విజయవంతంగా తొలి స్వదేశీ ఏరోస్టాట్ రాడార్ ప్రయోగం
ఆగ్రా,డిసెంబర్ 28 : తొలి స్వదేశీ ఏరోస్టాట్ రాడార్ను మంగళవారమిక్కడ విజయవంతంగా ప్రయోగించారు. ఈ బెలూన్ రాడార్ వల్ల సైనిక దళాల నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుందని ప్రాజెక్ట్ డెరైక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. ఆగ్రాలోని మిలటరీ కాంపౌండ్లో ఈ రాడార్ను విజయవంతంగా ప్రయోగించారు. హీలియంతో నింపిన ఈ ఏరోస్టాట్లో రాత్రి వేళల్లో చూడగలిగే కెమెరాలు, శబ్దగ్రాహక పరికరాలు ఉన్నాయి. ఏరోస్టాట్ రాడార్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని, మరో రెండ్రోజుల వరకూ దీన్ని భూమి నుంచి కిలోమీటరు ఎత్తులో ఉంచుతామని గుప్తా చెప్పారు. ఒక కిలోమీటర్ ఎత్తు నుంచి 110 కిలోమీటర్ల మేర నిఘా పెట్టగలిగే ఈ రాడార్కు రూ. 20 కోట్ల వ్యయమైందని తెలిపారు. ప్రస్తుతం ఆగ్రాలోని చరిత్రాత్మక తాజ్మహల్తోపాటు ఇతర ముఖ్యప్రాంతాల్లో పగలు, రాత్రి పూట్ల పరిస్థితులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామన్నారు. నిఘా అవసరాలతోపాటు విపత్తు నిర్వహణ సమయంలోనూ దీన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు.
Comments