ఘనంగా ప్రారంభమైన ‘శ్రీరామరాజ్యం’
హైదరాబాద్: బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ ఘనంగా ప్రారంభమైంది. బాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ శ్రీరామునిగా, నయనతార సీతగా, శ్రీకాంత్ లక్ష్మణునిగా, డా.అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా కనువిందు చేయబోతున్నారు. బాపు చిరకాల మిత్రుడు ముళ్లపూడి వెంకటరమణ తనదైన శైలిలో రచనను అందిస్తున్నారు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ రామకృష్ణా స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో..దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో బాలకృష్ణ క్లాప్ కొట్టగా, రమేష్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బాపు దర్శకత్వం వహించారు.బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయి కీర్తి తెచ్చిన బాపు-రమణలనుంచి వస్తున్న మరో అద్భుత దృశ్యకావ్యమని, సీనియర్ నటీనటులంతా ఉన్న ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. నిర్మాత ఎలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ బాపు, ముళ్లపూడి, ఇళయరాజా అంగీకారం..హీరో ప్రోత్సాహంతోనే ఈ సినిమా సాధ్యమైందని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిస్తామని అన్నారు. జయసుధ, బాలయ్య, మురళీమోహన్, బ్రహ్మానందం, కె.ఆర్.విజయ, ఝాన్సీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, గ్రాఫిక్స్ : కమల్కణ్ణన్ (మగధీర ఫేం), ఛాయాగ్రహణం: పి.ఆర్కే.రాజు, ఎడిటింగ్: జి.జి.కృష్ణారావు, డాన్స్:శ్రీను, పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల.
Comments