Monday, November 29, 2010

నా కుటుంబ మీద ఎందుకు ఇలా కత్తి కట్టారు?సోనియాకు జగన్ లేఖ పూర్తిపాఠం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి.,

 తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. గడచిన 14 నెలలుగా అనేక అవమానాలను దిగమింగుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద చివరకు జనహృదయ నేత దివంగతుడైన నా తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా నీచమైన స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఓపిగ్గా సహిస్తూ వస్తున్నాను. చివరకు కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టే కుటిల నీతిని చూసి అవాక్కయ్యాను. మా చిన్నాన్న వైఎస్.వివేకానంద రెడ్డికి ఆశలు చూపి పథకం ప్రకారం ఢిల్లీకి రప్పించుకుని మా కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయం చేస్తారా? గులాం నబీ ఆజాద్ సూచనలతోనే ఢిల్లీకి వెళ్లాడని, జగన్‌కు కుటుంబంతోనే పగ్గాలు వేయాలని ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తీవ్రమైన వ్యధకు గురయ్యాను. జరుగుతున్న పరిణామాలన్నీ నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికీ, రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలను తుడిచి వేయడానికి జరుగుతున్నవేనని నాకు అర్థమవుతూనే ఉంది. అసలెందుకు ఇలా జరుగుతోంది.

నేను చేసిన నేరమేమిటి? నా మీద, నా కుటుంబ మీద ఎందుకు ఇలా కత్తి కట్టారు? నా తండ్రి కీర్తి ప్రతిష్టల మీద ఎందుకు పరదాలు కప్పుతున్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏమిటది? నా తండ్రి చనిపోయిన రోజున 150 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పదవికి నా పేరును ప్రతిపాదించి సంతకాలు చేస్తే మీ అభీష్టం మేరకు నేను దూరంగానే ఉన్నానే.. అది తప్పా? మీ ఆదేశాన్ని శిరసా వహించి రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి నేనే ప్రతిపాదించాను. కదా.. అది తప్పా? మొన్నటికి మొన్న మీరు ముఖ్యమంత్రిని మార్చి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాలనుకున్నపుడు సీఎల్పీ సమావేశం సజావుగా సాగేలా సంపూర్ణంగా సహకరించాను కదా.. అది కూడా తప్పేనా?

ఇక నేను చేసిన తప్పేమిటి.. ఓదార్పు యాత్రేనా? అది నా వ్యక్తిగతమని నేను ఆచరించి తీరాల్సిన పుత్రధర్మమనీ ఇప్పటికి అనేకసార్లు చెప్పాను. నా తండ్రి గారు జనహృదయాలను చూరగొన్న మహానేత కావడం వల్ల ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు అనాధలయ్యాయి. ఈ నేపథ్యంలో మా నాన్న చనిపోయిన 20 రోజులకే, దుర్ఘటన జరిగిన పావురాల గుట్ట సాక్షిగా అక్కడ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబాలను వారింటికే వెళ్లి పలుకరిస్తానని మాటిచ్చాను. దివంగతులైన నా తండ్రి ఆత్మశాంతి కోసం నేను ఆనాడు మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కనుకనే ఇది ఆచరించి తీరాల్సిన సాంప్రదాయం కనుకనే, యాత్రకు మీ అనుమతి కోరాను. గత నవంబరులోనే ప్రారంభం కావాల్సిన యాత్రను మీ సూచన మేరకు మీమీద గౌరవంతో వాయిదా వేసుకున్నాను.

అనంతరం ఓదార్పు యాత్రను ప్రారంభించిన నాటి నుంచి మా మీద దాడి మొదలైంది. కారణం ఆ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడమే. జనం గుండెల్లో రాజశేఖర రెడ్డి సజీవంగా ఉన్నాడని, సజీవంగా ఉంటాడని తేటతెల్లం కావడం కొందరు కాంగ్రెస్ పెద్దలకు మింగుడుపడ లేదు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. పార్టీని రెండుసార్లు ఒంటి చేత్తో విజయపథానికి నడిపించిన జననేత విగ్రహాలు ఊరూరా పెడితే పార్టీకి ఏ విధంగా నష్టమో చెప్పగలరా? లేని ఉద్దేశాలను నాకు ఆపాదించారు. మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నతిని ఓర్వలేని కొందరు నేతలు చేస్తున్న కార్యక్రమంగా దీనిని నేను సరిపెట్టుకున్నాను. కానీ, క్రమంగా జరుగుతున్న పరిణామాలతో నాకో విషయం అర్థం కావడం మొదలైంది. జనం గుండెల్లో నుంచి వైఎస్సార్ ప్రతిబింబాన్ని తుడిచి వేయాలని, ఆయన జ్ఞాపకాలను సైతం ధ్వంసం చేయాలని ఢిల్లీ స్థాయిలోనే ఒక పకడ్బందీ వ్యూహం తయారైనట్టు నాకు అర్థమైంది.

దురదృష్టవశాత్తు ఈ వ్యూహకర్తలకు సాక్షాత్తు అధిష్టానం ఆశీస్సులు ఉన్నట్టు తేటతెల్లమైంది. మిమ్మల్ని కలవాలని ఓదార్పు యాత్ర ఉద్దేశాలను వివరించాలని దివంగత నేత సతీమణి, నా తల్లి విజయలక్ష్మి గారు మీ అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశారు. నెల రోజులకు గానీ మాకు మీ సందర్శన కోసం అనుమతి లభించలేదు. మీకు అవసరం ఉంటే మా చిన్నాన్నకు అయినా.. చిరంజీవికి అయినా ఒక్క రోజులో అపాయింట్‌మెంట్ దొరుకుతుంది లేదంటే దివంగత నేత వైఎస్ సతీమణి తన భర్తను కోల్పోయిన కొద్ది నెలలకే మీ అపాయింట్‌మెంట్ అడిగితే నెల రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా మేమేమీ బాధ పడలేదు. ఆ భేటీలో మీకు అన్ని విషయాలు వివరించాం. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనకూడదని కట్టడి చేశారు. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్లు చేశారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్లు చేశారు. ఆ యాత్రకు ఎవ్వరూ సహరించకుండా ప్రయత్నాలు చేశారు.

అయినా వైఎస్‌ను అభిమానించే జనసామాన్యం, కిందిస్థాయి కార్యకర్తల అండదండలతో యాత్ర విజయవంతంగా సాగింది. యాత్రలో పాల్గొన్న వారిమీద, నాకు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. మద్దతుగా నిలిచిన వారిపై వేటు వేశారు. ఓదార్పు యాత్రను భగ్నం చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌కు ఆగర్భ శత్రువులమని స్వయంగా ప్రకటించుకున్న మీడియాతో స్నేహం చేసి తప్పుడు ఆరోపణాస్త్రాలను మా మీద సంధించారు. దివంగత నేత మీద కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు.

ఆయన లేరని తెలిసి, ఆరోపణలకు బదులు ఇచ్చుకోలేరని తెలిసి కొందరు పార్టీ నేతలో ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. సాక్షాత్తు మిమ్మల్నే కలిసి వచ్చిన కొందరు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గానీ, రాష్ట్ర మంత్రివర్గం గానీ కనీసం ఖండించనైనా లేదు. నిన్నటిదాకా ఉన్న మంత్రివర్గమంతా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మంత్రివర్గమే. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరు భాగస్వాములే. అయినా సరే ఆ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నమే వారు చేయలేదు. ఇంకో పక్క వైఎస్సార్ జ్ఞాపకాలు తుడిచి వేసే ప్రయత్నం కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సభల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ఫోటో లేకపోవడం ప్రతిసారి వివాదాస్పదమవుతోంది. ఆయన ఫోటో లేనందుకు జనం నిలదీస్తున్నారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాలేదు.

అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం వైఎస్సార్ మరణంపై జరిగిన కంటి తుడుపు దర్యాప్తు. నాతో సహా ప్రజల్లో ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను సీబీఐ, నిపుణులు నివేదికలు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేక పోయాయి. జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కనీసం ఏ ఒక్కరినైనా ఈ దర్యాప్తు వేలెత్తి చూపలేక పోయింది. ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోయారు. దాని గురించి మాట్లాడటమే మహా పాపమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

నన్ను పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించడానికి ప్రతి చిన్న సంఘటనను అవకాశంగా మల్చుకుంటున్నారు. సాక్షి ఛానల్‌లో వచ్చిన ఒక రాజకీయ విశ్లేషణ కథనాన్ని భూతద్దంలో చూపి సాక్షి కార్యాలయాలపై కొందరు నేతలు దాడులు చేయించారు. పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నేనే కుట్ర చేసినట్టు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా సాక్షి ఛానల్ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలతో పాటు కొన్ని సానుకూల, ప్రతికూలాంశాలను చర్చించింది. ఇలాంటి కథనాలే ఇతర జాతీయ పత్రికల్లో, మేగజైన్లలో వచ్చాయి.

అలాగే, బీహార్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో రాహుల్ గాంధీ ప్రస్తావన అన్ని జాతీయ, ప్రాంతీయ ఛానళ్ళతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. దీనినీ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. సాక్షి పత్రిక గానీ, సాక్షి ఛానల్ గానీ కాంగ్రెస్ పార్టీకి చెందినవి కావని, అవి స్వతంత్ర మీడియా సంస్థలుగా నిష్పక్షిపాతంగా పని చేస్తాయని, వాటిని ప్రారంభించిన రెండు సందర్భాల్లోనూ సభాముఖంగానే నేను ప్రకటించాను. ఆ సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర గవర్నర్, వీరప్ప మొయిలీ, ఆనందశర్మ వంటి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు సహా అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు, రాష్ట్ర మంత్రులూ ఉన్నారు.

అప్పుడూ ఏ ఒక్కరూ నా మాటలకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇపుడు కాంగ్రెస్ ఛానల్‌లో కాంగ్రెస్ వ్యతిరేక వార్త వచ్చిందనే అసత్య ప్రచారంతో పథకం ప్రకారం సాక్షిపై దాడులకు ఉసిగొల్పారు. ఢిల్లీ నుంచి అందిన ఆదేశాలతో యువజన కాంగ్రెస్ నేతలు కొందరు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ ఆందోళన ద్వారా జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర వేయడం వారి లక్ష్యం. నన్ను పార్టీ నుంచి గెంటివేసే కుట్ర జరుగుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? చివరకు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే నీచమైన ఎత్తుగడలకు దిగజారారంటే ఏమనుకోవాలి? ఇంకెంత కాలం సహనంతో ఉండాలి?

వీటికి తోడు ప్రతి రోజు నా పైన గాలి వార్తల ప్రచారం. నా మీద వేటుకు రంగం సిద్ధమైందంటూ మీడియాకు కథనాలు అందిస్తున్నారు. వేటా? లేటా? అని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే రోడ్డు మీద వెళ్లే ఏ చిన్న పిల్లాడిని అడిగినా 'నేడో రేపో జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారు" అని ఠకీమని సమాధానం చెపుతారు. అదును కోసం చూస్తున్నారని, జగన్‌పై ఇక వేటు వేస్తారని సామాన్య జనం కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విష ప్రచారాల నడుమ, ఇన్ని కుట్రలు, కుహకాల మధ్య మహానేత ప్రతిష్టకు మసిపూసే కుయుక్తులను సహిస్తూ ఇంకా ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావిస్తున్నా.. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది జనానికి అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది. ఏ పార్టీ కోసమైతే నా తండ్రి తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఆయన కుటుంబానికి కల్పించడం, అందుకు అధిష్టానం ఆశీస్సులు ఉండటం అత్యంత శోచనీయం. నాకు మరో మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేనూ, నా తల్లి విజయలక్ష్మి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి నా తల్లి గారు, పార్లమెంట్ సభ్యత్వానికి నేనూ రాజీనామా చేస్తున్నాం.

ఈ సందర్భంగా మీకో విషయాన్ని స్పష్టం చేయదలిచాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాలు చేయించారు. అటువంటి నీచమైన వ్యక్తిత్వం కాదు నాది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఒక మాట ఇస్తే దానికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని మా నాన్న నాకు నేర్పించారు. అలాగే రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా విశ్వసనీయత పెంపొందించుకోవాలని, ఉన్నత విలువలు పాటించాలని ఆయన నాకు నేర్పారు. ఈ విలువలు దిగజార్చేలా నేనెప్పుడూ వ్యవహరించలేదు. ఇక ముందూ వ్యవహరించబోను.

నేను గతంలో లాగే ఇక ముందు కూడా విలువలను పాటిస్తాను... గౌరవిస్తాను. నేను ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొడతానని మీరు భయపడుతున్న నేపథ్యంలో ఆ విలువల స్ఫూర్తితోనే మీకు హామీ ఇస్తున్నాను... నా తండ్రిని గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్న పార్టీ శాసనసభ్యులందరికీ ఇప్పుడే ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నా.. మీరెవ్వరూ నా కోసం రాజీనామాలు చేయవద్దని.. మీరెక్కడ ఉన్నా మీ ప్రేమాభిమానాలు నాపై ఉంటే చాలని..

ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నదే ముఖ్యమని నా తండ్రి తరచూ చెబుతుండేవారు. ఆయన నాకు నేర్పిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలు నాకు మార్గదర్శకాలు, అవే నన్ను నడిపిస్తాయి.

ఇక సెలవు.
మీ...
వై.యస్.జగన్.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...