పార్లమెంట్ శీతాకాల సమావేశాల కుదింపు?
న్యూఢిల్లి,నవంబర్ 18: 2జి స్ప్రెక్ట్రం కుంభకోణం పై సం యుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు పట్టు బడుతూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుండడంతో శీతాకాల సమావేశాలను ప్రభుత్వం గడువు కంటె ముందుగానే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెలికాం మంత్రి రాజా రాజినామా తో శాంతించని విపక్షాలు ప్రధాని పై సుప్రిం కోర్టు వ్యాఖ్యల దరిమిలా సం యుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు పట్టు బడుతూ పార్లమెంట్ దిగ్బంధాన్ని కొనసాగిస్తున్నాయి. గురువారం ఐదో రోజు కూడా 2జి స్ప్రెక్ట్రం కుంభకోణం పై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు లోక్సభ, రాజ్యసభలను స్తంభింపజేశాయి. దీంతో ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్)లు కర్ణాటక సీఎం యడ్యూరప్ప భూ వివాదాన్ని లేవనెత్తి ప్రతిపక్షాలకు ధీటుగా బదులిచ్చాయి. విపక్ష సభ్యుల నిరసనలతో... రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే వాయిదా పడింది. లోక్సభ మొదట మధ్యాహ్నం వరకూ, పరిస్థితిలో మార్పు లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది.
Comments